వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, పోషకాలను అందించడానికి రాగులు అద్భుతమైన ఆహారం. ఇవి ఆరోగ్యకరమైనవే కాకుండా అద్భుతమైన రుచిని కూడా అందిస్తాయి. సాధారణంగా అందరూ రాగులను రొట్టెలుగా లేదా జావాగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఈ కొత్త విధానంలో రాగి సూప్ రూపంలో తయారు చేసుకొని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాగి సూప్కు ప్రధానమైనది మొలకెత్తిన రాగి పిండి. మొలకెత్తిన రాగులు మరింత ఆరోగ్యకరమైనవి. దీని తయారీకి ఒక కిలో రాగులను శుభ్రంగా కడిగి ఒక రోజంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీటిలో నుంచి తీసి, శుభ్రంగా కడిగి ఒక గుడ్డలో కట్టి వేలాడదీయాలి. రెండు రోజులకు సన్నని మొలకలు వస్తాయి. ఈ మొలకెత్తిన రాగులను పల్చగా ఆరబోసి, పూర్తిగా ఎండిన తర్వాత ఖాళీ మూకుడులో దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల పిండి చాలా మెత్తగా, సువాసనభరితంగా ఉంటుంది.
రాగి జావను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. దీనిని ఉడకబెట్టి పాలు, పంచదార లేదా బెల్లంతో తీసుకోవచ్చు. మజ్జిగ, ఉప్పు కలిపి తోప, అంబలి లేదా కలి వంటి సంప్రదాయ పానీయాలుగా కూడా సేవించవచ్చు. రాగులు ఆరు-ఏడు నెలల చంటి పిల్లల నుండి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం.














