AP Pensions : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం’ ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత , గీత కార్మికులు వంటి లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రతి నెలా ఆర్థిక భరోసా అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో, దీనికి సంబంధించిన అర్హతలు , దరఖాస్తు విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పింఛన్ పంపిణీ విధానం, (AP Pensions) లబ్ధిదారుల వివరాలు
ఈ పథకం కింద ప్రతి నెలా ఒకటో తేదీనే అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు. ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం లేదా ఇతర సెలవు దినం వచ్చినట్లయితే, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందు రోజే పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తోంది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. (AP Pensions) ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వృద్ధులకు ప్రతి నెలా రూ. 4,000 , వికలాంగులకు రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతోంది. వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు , డయాలసిస్ పేషెంట్లు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.

పింఛన్ మంజూరుకు ఉండాల్సిన అర్హతలు , (AP Pensions) పరిమితులు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ నెల ఆదాయం రూ. 10,000 లోపు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 లోపు ఉండాలి. భూమి విషయానికి వస్తే, కుటుంబం మొత్తానికి కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. అలాగే లబ్ధిదారుల ఇంట్లో కారు వంటి లగ్జరీ వాహనాలు ఉండకూడదని, నెలవారీ కరెంట్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేదా ఇప్పటికే ప్రభుత్వ పింఛన్ పొందుతున్నా, లేక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా వారు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే పింఛన్ మంజూరు చేసే నిబంధన అమలులో ఉంది.
Read Also : Tamil Nadu Elections 2026 : తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. ఏఐఏడీఎంకేతో పొత్తు ఖాయమేనా?
దరఖాస్తు ప్రక్రియ , అవసరమైన పత్రాలు
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం , ఆధార్ అప్డేట్ హిస్టరీ వంటి కీలక పత్రాలను జత చేయాలి. ముఖ్యంగా వికలాంగులు పింఛన్ పొందాలంటే తప్పనిసరిగా ‘సదరం’ (SADAREM) సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల ద్వారా వైకల్యాన్ని నిర్ధారించుకున్న తర్వాత సర్టిఫికేట్ పొందవచ్చు. సచివాలయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి సచివాలయ అధికారులు లేదా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.














