Mudra Loan Fraud : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆశే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ (PMMY) పథకాన్ని తమ మోసాలకు ఆయుధంగా మార్చుకున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని, కేవలం రూ.860 అగ్రిమెంట్ ఛార్జీలు కడితే చాలు, ఏకంగా రూ.7 లక్షల రుణం మంజూరు చేస్తామంటూ నకిలీ అప్రూవల్ లేఖలతో వల విసురుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ లేఖలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం PIB Fact Check స్పందిస్తూ, ఇది పక్కా మోసమని, ప్రజలు ఎవరూ ఇలాంటి వాటిని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించింది.
Also Read : Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. మీకు వచ్చాయో లేదో ఆన్లైన్లో ఇలా చెక్ చేయండి.!
నకిలీ అప్రూవల్ లేఖల (Mudra Loan Fraud) వెనుక ఉన్న అసలు మతలబు
సోషల్ మీడియా ద్వారా పంపిణీ అవుతున్న ఈ నకిలీ లేఖలు చూడటానికి అచ్చం ప్రభుత్వ పత్రాల వలె కనిపిస్తాయి. వీటిలో లోన్ రిజిస్ట్రేషన్ నంబర్లు, క్యూఆర్ కోడ్లు , అధికారిక ముద్రలను పోలిన చిహ్నాలను ఉపయోగిస్తున్నారు. కేవలం రూ.860 వంటి చిన్న మొత్తాన్ని అగ్రిమెంట్ ఫీజుగా అడగడం వెనుక ఒక పెద్ద టెక్నిక్ దాగి ఉంది. అతి తక్కువ మొత్తం కాబట్టి ఎవరికీ అనుమానం రాదని, కడితే పోయేదేముందిలే అన్న ఆలోచనతో ప్రజలు డబ్బులు చెల్లిస్తారని మోసగాళ్లు భావిస్తారు. ఇలా వేల మంది నుండి చిన్న చిన్న మొత్తాలను వసూలు చేస్తూ ఈ ముఠాలు కోట్లు గడిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆ డబ్బు కడితే, ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అని, జిఎస్టి అని మరిన్ని డబ్బులు అడగడం లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం వంటివి జరుగుతాయి.

ముద్ర సంస్థ పనితీరుపై (Mudra Loan Fraud) అవగాహన పెంచుకోండి
ప్రభుత్వ పథకాల గురించి సరైన అవగాహన లేకపోవడమే ఈ మోసాలకు ప్రధాన కారణం. నిజానికి ‘ముద్ర’ (MUDRA – Micro Units Development & Refinance Agency Ltd) అనేది ఒక రీ-ఫైనాన్సింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది నేరుగా వ్యక్తులకు లేదా వ్యాపారులకు లోన్లు ఇచ్చే సంస్థ కాదు. ముద్ర సంస్థ కేవలం వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు , ఇతర ఆర్థిక సంస్థలకు (NBFCs) నిధులను సమకూరుస్తుంది. ఆ సంస్థలే క్షేత్రస్థాయిలో ప్రజలకు రుణాలను అందజేస్తాయి. కాబట్టి నేరుగా ‘ముద్ర’ హెడ్ ఆఫీస్ నుండి మీకు లోన్ అప్రూవల్ లెటర్ వచ్చిందంటే అది వంద శాతం నకిలీ అని గ్రహించాలి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా రుణ మంజూరు కోసం ముందుగా నగదు చెల్లించాలని ఏ అభ్యర్థిని అడగదు.
Also Read : NTR 31 : ఎన్టీఆర్-నీల్ మూవీ ‘డ్రాగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ షాక్.. కానీ..!
రుణం పొందడానికి సరైన మార్గం , రక్షణ చర్యలు
ముద్ర యోజన కింద రుణం పొందాలనుకునే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్లైన్లో వచ్చే ప్రకటనలను నమ్మకూడదు. మీకు నిజంగా రుణం కావాలంటే మీరు నేరుగా బ్యాంకును సంప్రదించాలి లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన mudra.org.in ను మాత్రమే సందర్శించాలి. రుణ ప్రక్రియలో ఏదైనా ఫీజు ఉంటే, అది మీ లోన్ అమౌంట్ నుండి మినహాయించుకుంటారే తప్ప ముందే కట్టమని కోరరు. గుర్తుతెలియని వ్యక్తులకు మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు లేదా బ్యాంక్ ఓటిపిలను పంచుకోవడం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి నకిలీ లేఖలు మీకు వాట్సాప్లో వస్తే వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయకుండా, అది మోసమని మీ స్నేహితులు , బంధువులను అప్రమత్తం చేయడం మనందరి బాధ్యత.














