Ongole: సండే వస్తుందంటే చాలు.. మాంసాహార దుకాణాల దగ్గర క్యూలే క్యూలు. కోడి, మేక, పొట్టేలు.. ఏది దొరికినా సరే కొనుక్కునే జనాలు. కానీ అదే సండే రోజు.. ప్లేట్లో పడేది ఏమిటో కూడా తెలియకుండా మోసం జరిగితే? ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బయటపడిన షాకింగ్ విషయం. ఒంగోలులో ఓ గ్యాంగ్.. గుర్రపు మాంసాన్ని గాడిద మాంసం పేరిట విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది.
సండే గిరాకీనే టార్గెట్
ప్రతి ఆదివారం మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోతాయి. ఈ భారీ గిరాకీనే ఆసరాగా చేసుకుని ఈ గ్యాంగ్ ప్లాన్ వేసింది. ఒంగోలులో అప్పుడప్పుడు గాడిద మాంసం విక్రయాలు కనిపిస్తుండటంతో.. అదే పేరుతో గుర్రపు మాంసాన్ని అమ్మాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
మంగమూరు రోడ్డులో గుట్టు రట్టు
శనివారం అర్ధరాత్రి సమయంలో మంగమూరు రోడ్డులో అనుమానాస్పదంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒంగోలు తాలూకా పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు కూడా షాక్కు గురయ్యారు.
గుర్రాలను హతమార్చి విక్రయానికి సిద్ధం
జాయాయిల్ తోటలో గుర్రాలను హతమార్చి.. ఉదయం మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా గుర్రపు మాంసం వినియోగం చాలా అరుదు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్యాంగ్.. గాడిద మాంసం పేరుతో అమ్మాలని ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది.
ఎక్కడి నుంచి తెచ్చారు?
పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి ప్రాంతం నుంచి 5 గుర్రాలను కొనుగోలు చేసి తీసుకువచ్చినట్లు గుర్తించారు. అందులో ఇప్పటికే 3 గుర్రాలను హతమార్చినట్లు, మిగిలిన రెండు గుర్రాలను అక్కడే ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
7 మంది అరెస్ట్
ఈ కేసులో మొత్తం 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన రెండు గుర్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. నాలుగు ఆటోలు, ఒక కారును కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల ప్రకారం ఈ గ్యాంగ్ అసలు లక్ష్యం ప్రజలను మోసం చేయడమే. గాడిద మాంసం కొనుగోలు చేసే వారిని టార్గెట్ చేసి.. గుర్రపు మాంసాన్ని అదే పేరుతో విక్రయిస్తూ లాభాలు పొందాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.
Also Read: https://www.telugunews.co/free-electricity-weavers-how-to-apply-ap/
ఆహార భద్రతపై ఆందోళన
ఈ ఘటన ఇప్పుడు ఆహార భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. మనం కొనుగోలు చేస్తున్న మాంసం నిజంగా అదేనా? లేక ఇంకేదైనా మోసం జరుగుతోందా? అనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.
పోలీసుల హెచ్చరిక
ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని సూచిస్తున్నారు. ఒంగోలులో బయటపడిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తోంది. సండే రోజు ప్లేట్లో పడే మాంసం వెనుక ఇలాంటి మోసాలు జరుగుతాయా? అనే ఆందోళన కలుగుతోంది. జాగ్రత్తగా ఉండటం, నమ్మకమైన చోట్ల నుంచే కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత అవసరమైంది.







