Delhi: ఒక్కసారిగా అధికారులు, సిబ్బంది రోడ్లపైకి వచ్చారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూశారు. ఇంకేముంది నేరుగా వాటిని తీసివేశారు. ఇదేంటి.. ఉన్న సీసీ కెమెరాలను ఎందుకు తీసేశారని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.. అసలు విషయం తెలుసుకోండి.
ఢిల్లీలో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా మొదలైంది. రోడ్లపై, కాలనీల్లో, ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 1.4 లక్షల CCTV కెమెరాలను దశలవారీగా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సాధారణ మార్పు కాదు.. భద్రత కోణంలో తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
వీటిని ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం కొంచెం లోతుగా వెళ్తే తెలుస్తుంది. ఇప్పటివరకు నగర భద్రత కోసం పెద్ద ఎత్తున ఉపయోగించిన ఈ కెమెరాలలో చాలా వరకు చైనా కంపెనీలకు చెందినవే. వీటి పనితీరు బాగానే ఉన్నప్పటికీ, వాటి వెనుక ఉన్న డేటా సెక్యూరిటీ అంశం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది.
సీసీటీవీ అంటే కేవలం వీడియో రికార్డింగ్ మాత్రమే కాదు. ప్రతి కదలిక, ప్రతి వాహనం, ప్రతి వ్యక్తి వివరాలు ఇందులో రికార్డ్ అవుతాయి. ఇవన్నీ డిజిటల్ డేటాగా మారి సర్వర్లలో నిల్వ ఉంటాయి. ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఎవరి చేతుల్లోకి చేరుతుంది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని విదేశీ పరికరాల ద్వారా డేటా లీక్ అయ్యే అవకాశం పూర్తిగా తోసిపుచ్చలేమని చెబుతున్నారు. ముఖ్యంగా చైనా కంపెనీల తయారీ సర్వైలెన్స్ పరికరాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే ఆందోళన ఇప్పుడు ఢిల్లీ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇంకా ఒక కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. దేశ భద్రత. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత భారత్ విదేశీ పరికరాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టెలికాం నుంచి యాప్స్ వరకు వచ్చిన మార్పుల తర్వాత ఇప్పుడు సర్వైలెన్స్ సిస్టమ్స్పై కూడా దృష్టి పడింది. అందుకే నమ్మకమైన వనరుల నుంచి మాత్రమే పరికరాలు వాడాలనే పాలసీ అమల్లోకి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న చైనా CCTV కెమెరాలను తొలగించి, వాటి స్థానంలో సురక్షితమైన, విశ్వసనీయమైన పరికరాలను ఏర్పాటు చేసే ప్లాన్ రూపొందించారు. దీని వల్ల డేటా కంట్రోల్ దేశంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమవుతుందా? లేక దేశవ్యాప్తంగా ఇలాంటి మార్పులు వస్తాయా? అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే నగరాల భద్రతలో సీసీటీవీల పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.
కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే.. భద్రత కోసం పెట్టిన కెమెరాలు, నిజంగా మన భద్రతకే పనిచేస్తున్నాయా? లేక మరొకరికి సమాచారం అందించే మార్గంగా మారుతున్నాయా?ఈ సందేహానికి సమాధానం వెతికే ప్రయత్నమే ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా మన సొమ్ము మనదే.. కానీ పరాయి సొమ్ము మనదని అనుకుంటే, ఇలాంటి డేంజర్ పొంచి ఉండడం కామన్ ఏమో కదా!

