CM Chandrababu: రాజకీయ సభలలో సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం, ప్రాజెక్టుల గురించి మాట్లాడటం చూస్తుంటాం. కానీ ఈసారి బాపట్ల జిల్లా సూరేపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ వ్యవస్థపై ప్రత్యేకంగా మాట్లాడటం గమనార్హంగా మారింది. “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా సూరేపల్లికి వచ్చిన సీఎం, అక్కడ ప్రజావేదికపై మాట్లాడుతూనే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్లు చేస్తున్న కృషిని గుర్తిస్తూ, గంజాయి నియంత్రణలో బాపట్ల పోలీసులు చూపుతున్న కట్టుదిట్టమైన చర్యలను ఆయన ప్రశంసించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అంశం హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో, సీఎం ఈ విషయంపై కఠినంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మహిళల భద్రత విషయానికి వస్తే, ఈ అంశాన్ని కూడా సీఎం సీరియస్గా తీసుకున్నారు.
మహిళలపై నేరాలను అరికట్టడంలో జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక ప్రశంస మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో పని కొనసాగించాలనే సంకేతంగా కనిపిస్తోంది. అంతేకాదు నో హెల్మెట్ – నో ఫ్యూయల్ కార్యక్రమం ద్వారా బైకర్స్ కు హెల్మెట్ పై అవగాహన కల్పించడం, ప్రమాదాల నివారణకు చొరవ చూపడంపై ఎస్పీ తో పాటు పోలీస్ అధికారులను, సిబ్బందిని సీఎం ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
ఈ సందర్భంలో సీఎం.. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. ఈ సభలో అత్యంత చర్చనీయాంశంగా మారింది సీఎం చేసిన గంజాయి పై వ్యాఖ్యలే. “గంజాయి సేవించి ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారి చివరి రోజు అవుతుంది” అనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్నవారిని మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. గంజాయి గ్యాంగ్లపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తున్నదనే సంకేతాన్ని సీఎం ఇచ్చారు.
Also Read: https://www.telugunews.co/atchannaidu-tweet-paddy-payment-24-hours-ap/
“రాష్ట్రంలో గంజాయికి చోటు ఉండదు” అని స్పష్టంగా చెప్పడం ద్వారా, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలియజేశారు. ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తున్న డ్రగ్స్ సమస్యను కట్టడి చేయడంలో పోలీస్లకు పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆయన సూచించారు. బాపట్ల జిల్లాలో గంజాయి నియంత్రణలో పోలీస్లు తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తోందని సీఎం చెప్పారు. ఇది ఒక జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిన మోడల్గా భావిస్తున్నారు.
ఇక మరో కీలక అంశం.. మహిళలపై నేరాలు. ఈ విషయంలో కూడా సీఎం స్పష్టంగా చెప్పారు. “ఆడబిడ్డల భద్రతపై రాజీ లేదు” అనే మెసేజ్ ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ, ఎస్పీ ఉమామహేశ్వర్ పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు. ఇది కేవలం ఒక ప్రశంస కాదు.. పోలీస్ వ్యవస్థకు ఇచ్చిన ఓ పబ్లిక్ సపోర్ట్, అలాగే కఠిన చర్యలకు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ గా చెప్పవచ్చు.
సూరేపల్లి సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఒకవైపు పోలీస్లకు ప్రశంసలు.. మరోవైపు గంజాయి గ్యాంగ్లకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదే ఈ సభ ప్రత్యేకత. గంజాయికి నో.. నేరాలకు జీరో టాలరెన్స్ అని సీఎం చెప్పడం విశేషం.














