Fact Check: ఇటీవల WhatsApp ఓపెన్ చేసిన వాళ్లందరికీ ఒకే మెసేజ్ కనిపిస్తోంది. ప్రతి కుటుంబానికి రూ. 5000 ఇస్తారు.. వెంటనే అప్లై చేయండి అంటూ వచ్చే ఈ మెసేజ్ చూసి చాలామంది ఒక్కసారి షాక్ కు గురవుతున్నారు. ఎవరికైనా డబ్బు వస్తుందంటే సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. అదే విషయం ఇక్కడ కూడా జరుగుతోంది.
వాట్సాప్ గ్రూప్ లలో చూస్తే.. ఇప్పుడే ఛాన్స్ అంటూ ఒకటే మెసేజ్ లు. అది కూడా హ్యాక్ చేయడం ఈ తరహా మోసాలకు పాల్పడడం. కొంతమంది ఇది నిజమే అనుకుని వెంటనే ఆ మెసేజ్ను తమ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంకొందరు అందులో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ఏముందో చూడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఇలాంటి మెసేజ్ నిజంగా ప్రభుత్వం పంపుతుందా?
పైకి చూస్తే ఇది ఒక సాధారణ స్కీమ్ సమాచారం లాగా అనిపించవచ్చు. కానీ కాస్త లోతుగా గమనిస్తే ఇందులో కొన్ని సందేహాస్పద అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా “ఇప్పుడే అప్లై చేయండి”, “ఈ లింక్ ఓపెన్ చేయండి” వంటి పదాలు ఉండటం కొంచెం అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే నిజమైన ప్రభుత్వ పథకాలు ఇలాంటి తొందర మెసేజ్ల రూపంలో ఎప్పుడూ సెండ్ చేయదు.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి మెసేజ్లు ఎక్కువగా వైరల్ అవ్వడానికి కారణం మనమే. ఒకసారి చూసి నమ్మితే వెంటనే షేర్ చేయడం, లింక్ ఓపెన్ చేయడం, ఇలా ఒక్కో వ్యక్తి ద్వారా అది వేల మందికి చేరుతుంది. కానీ ఆ మెసేజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో చాలామంది ఆలోచించరు. ప్రస్తుతం కూడా ఇదే జరుగుతోంది. “రూ. 5000 ఇస్తారు” అనే మాట వినగానే నిజమా కాదా అని చెక్ చేయకుండా చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇక్కడే కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇటువంటి మెసేజ్ల వెనుక చాలాసార్లు వేరే ఉద్దేశ్యాలు దాగి ఉంటాయి.
అయితే అసలు విషయం ఏంటి? నిజంగా ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ తీసుకువచ్చిందా? లేక ఇది మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ మెసేజ్ మాత్రమేనా? ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అసలు విషయం ఏమిటి?
ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు ముందుగా చూడాల్సిన విషయం.. అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. ఈ రూ.5000 మెసేజ్ విషయంలో గమనిస్తే, ఎక్కడా స్పష్టమైన ప్రభుత్వ గుర్తింపు కనిపించడం లేదు. ఏ శాఖ పేరు, అధికారిక ప్రకటన, సరైన వెబ్సైట్ లింక్.. ఇవేవీ క్లియర్గా ఇవ్వలేదు. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకొస్తే ముందుగా అధికారికంగా ప్రకటిస్తుంది. పత్రికలు, టీవీ ఛానెల్స్, అధికారిక వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సమాచారం అందుతుంది. కానీ ఈ మెసేజ్ మాత్రం నేరుగా WhatsAppలోనే తిరుగుతోంది. ఇదే మొదటి సందేహం.
ఇంకా ఈ మెసేజ్లో ఇచ్చిన లింక్ విషయానికి వస్తే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి లింక్లు చాలా సార్లు నిజమైన సైట్లు కావు. అవి మన సమాచారాన్ని సేకరించేలా లేదా మోసం చేసేలా రూపొందించి ఉంటాయి. కొన్నిసార్లు ఫోన్ నంబర్, ఆధార్, బ్యాంక్ వివరాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే బయటకు చూస్తే “స్కీమ్ అప్లికేషన్” లాగా కనిపించినా, లోపల మాత్రం మన డేటా తీసుకునే ట్రాప్ అయ్యే అవకాశం ఉంది.
ఎందుకు ఇలాంటి మెసేజ్లు వస్తాయి?
ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా “రూ.2000 వస్తుంది”, “ఫ్రీ గ్యాస్”, “ఫ్రీ ల్యాప్టాప్” అంటూ ఇలాంటి మెసేజ్లు చాలాసార్లు వైరల్ అయ్యాయి. ఎక్కువగా వీటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒకటి.. ఎక్కువ మంది లింక్ ఓపెన్ చేయించేలా చేయడం, రెండోది వ్యక్తిగత సమాచారం సేకరించడం. మనలో చాలా మంది ఆలోచించకుండా వెంటనే క్లిక్ చేయడం వల్లే ఇవి ఇంకా పెరుగుతున్నాయి.
అయితే క్లియర్గా చెప్పాలంటే.. ప్రస్తుతం వరకు “ప్రతి కుటుంబానికి రూ. 5000” అనే ఎలాంటి అధికారిక పథకం ప్రకటించబడిన సమాచారం లేదు. అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ మెసేజ్ను నమ్మడానికి సరైన ఆధారం లేదు.
జాగ్రత్తగా ఉండాలి ఎలా?
ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు.. వెంటనే నమ్మొద్దు, లింక్ ఓపెన్ చేయొద్దు, ముందుగా చెక్ చేయండి, అనుమానం ఉంటే షేర్ చేయకుండా ఆపేయండి. వైరల్ అవుతున్న ప్రతి మెసేజ్ నిజం కాదు.. ఒకసారి ఆలోచిస్తేనే అసలు విషయం తెలుస్తుంది.

