Crime Alert: హైదరాబాద్ రోడ్లపై ఒక్కసారిగా ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక బైక్పై ఇద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఏకంగా ఐదుగురు రైడింగ్. అదీ హెల్మెట్లు లేకుండా, ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ వెళ్తున్న ఈ సీన్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు. అది కూడా చిరునవ్వులు చిందిస్తూ.. తామేదో సాధించినట్లు ఆ యువకులు తెగ సందడి చేశారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని మరిచారు. ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో స్టంట్స్ చేశారు. పాపం.. పోలీసులు పట్టుకోలేరని భావించారు. అందుకే ఇలా రద్దీ రహదారిపై తమ ప్రతాపం చూపించారు. ఇది కేవలం వీడియోకే పరిమితం కాలేదు.. చివరికి పోలీసుల వరకు వెళ్లి, ఐదుగురి అరెస్టుతో ముగిసింది.
హైదరాబాద్లో ప్రమాదకర డ్రైవింగ్కు సంబంధించిన ఒక ఘటన కలకలం రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన మార్చి 29 అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. సైఫాబాద్ పరిధిలోని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ వైపు ఒక బైక్పై ఐదుగురు యువకులు రైడింగ్ చేశారు. వారు ఎలాంటి హెల్మెట్లు లేకుండా, రోడ్లపై స్టంట్స్ చేస్తూ వెళ్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఒక బైక్పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఇక్కడ ఐదుగురు ఒకేసారి ప్రయాణించడం, పైగా వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ఇతర వాహనదారులకు ప్రమాదంగా మారే పరిస్థితిని సృష్టించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా బైక్ నడిపిన యువకుడితో పాటు మిగతా నలుగురినీ అరెస్ట్ చేశారు. పోలీసులు ఈ కేసును చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రమాదకర డ్రైవింగ్ వంటి సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో పోలీసులు ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు. ఇలాంటి స్టంట్స్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కేవలం తమకే కాదు, రోడ్డుపై ఉన్న ఇతరులకు కూడా ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇలాంటి చర్యలు చివరికి చట్టపరమైన సమస్యలకే దారి తీస్తాయని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

