Bapatla: రోడ్డు మీద బైక్ ఎక్కి వెళ్లేటప్పుడు చాలామంది హెల్మెట్ను సీరియస్గా తీసుకోరు. చిన్న దూరం కదా.. ఏం అవుతుంది అన్న భావనతో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అదే నిర్లక్ష్యం ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బాపట్ల జిల్లా పోలీసులు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం ఒక రూల్ కాదు.. నేరుగా అమలు చేయబోయే కఠిన చర్యగా మారబోతోంది. అంతేకాదు పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ రూల్ పాటించకుంటే ఫైన్ గ్యారంటీ అనే హెచ్చరిక కూడా తెరమీదికి వచ్చింది.
హెల్మెట్ తప్పనిసరి.. లేదంటే ఫైన్
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఈ నెల 15 వరకు హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. శిరో రక్ష.. ప్రాణ రక్ష అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్పీ అధ్వర్యంలో పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. అంటే ఇప్పటివరకు ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడంపైనే ఫోకస్ ఉంటుంది. కానీ ఏప్రిల్ 16 నుంచి పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ఆ రోజు నుంచి హెల్మెట్ లేకుండా రోడ్డుపై కనిపిస్తే ఫైన్ తప్పదని స్పష్టంగా చెబుతున్నారు. ఇకపై ఎలాంటి సడలింపు ఉండదన్న సందేశం ఇస్తున్నారు.

పోలీసులకు ఇదే రూల్..
బాపట్ల జిల్లా పరిధిలోని ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది హెల్మెట్ రూల్ పాటించాల్సిందేనని ఎస్పీ హెచ్చరించారు. అందుకై ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహనతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం స్పెషల్ డ్రైవ్ సైతం నిర్వహించారు. మొత్తం మీద హెల్మెట్ లేకుంటే, పోలీసులకూ ఫైన్ గ్యారంటీ.
నో హెల్మెట్.. నో ఫ్యూయల్
ఈ నిర్ణయంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. “నో హెల్మెట్.. నో ఫ్యూయల్” రూల్. బాపట్ల కేంద్రంగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయాలని పోలీసులు సిద్ధమవుతున్నారు. అంటే హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్కి వెళ్లినా, ఫ్యూయల్ ఇవ్వకూడదనే ఆలోచన. ఇది అమల్లోకి వస్తే.. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం కష్టంగా మారే అవకాశం ఉంది.
Also Read: https://www.telugunews.co/ap-rains-weather-alert-thunderstorms-heatwave/
ఎందుకు ఈ కఠిన నిర్ణయం?
పోలీసుల ప్రకారం ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలు. చాలా ప్రమాదాల్లో తలకు గాయాలే ప్రాణనష్టం కలిగిస్తున్నాయి. హెల్మెట్ వాడితే చాలా ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

ప్రజలకు సూచనలు
ఇప్పటికైనా ప్రజలు హెల్మెట్ను తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇది కేవలం రూల్ కోసం కాదు.. మన ప్రాణాల కోసం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్న దూరం అయినా.. ఎక్కడికైనా వెళ్లినా హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
బాపట్లలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఒకవైపు కఠినంగా అనిపించినా, మరోవైపు ప్రజల ప్రాణ రక్షణ కోసం అవసరమని భావిస్తున్నారు. ఇప్పుడు చూడాల్సిందేమిటంటే.. ఈ రూల్ ఎలా అమలవుతుంది? ప్రజలు ఎంతవరకు పాటిస్తారు? అన్నది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కితే ఇబ్బందులు తప్పవు.




